తెలంగాణ రాష్ట్రానికి అంగీకరించం: రాయపాటి
న్యూఢిల్లీ: తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించబోమని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు తెగేసి చెప్పారు. ఒక వేళ తప్పనిసరి స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సి వస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలను, రంగారెడ్డి జిల్లాను, ఇతర హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. హైదరాబాద్లో, హైదరాబాద్ చుట్టుపక్కల తాము వందల, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టామని, వాటిని వదులుకోమంటే వదులుకోవడానికి సిద్ధంగా లేమని ఆయన అన్నారు. హైదరాబాద్లో, హైదరాబాద్ చుట్టుపక్కల గత ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టాయని, హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఖర్చు చేశాయని, ఇప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ పరిసరాల్లోనే పరిశ్రమలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ కన్నా తమ ఆంధ్రా ప్రాంతమే వెనకబడి వుందని ఆయన అన్నారు. గుంటూరో, విశాఖపట్నమో, విజయవాడనో రాజధాని అయి వుంటే అవి అభివృద్ధి చెంది వుండేవని, అక్కడే తాము పెట్టుబడులు పెట్టి వుండేవాళ్లమని ఆయన అన్నారు. తెలంగాణకు చెందిన నాయకులు ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పని చేశారని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణకు నిధులు ఖర్చు పెట్టారని, ఇప్పటి ప్రభుత్వం ఎక్కువ నిధులను తెలంగాణ అభివృద్ధికే పెడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక రాష్ట్రం అడుగుతున్నది తెలంగాణ అభివృద్ధి కోసమా, రాజకీయ లబ్ధి కోసమా? అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే అయితే ఆంధ్రా కన్నా తెలంగాణ ప్రాంతమే ఎక్కువ అభివృద్ధి జరిగిందనే విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. పులిచింతల ప్రాజెక్టు రాకపోతే తమ కాల్వలు ఎండిపోతాయని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై రెండో ఎస్సార్సీకి తమ పార్టీ కట్టుబడి వుందని, దానికి తాము కట్టుబడి వున్నామని ఆయన అన్నారు.