అసెంబ్లీలో నిరసన: స్పీకర్ ఛేంబర్ వద్ద తెరాస ధర్నా
హైదరాబాద్: తెలంగాణ అంశంపై వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి సోమవారానికి వాయిదా వేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేయాలని పట్టుబడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు పట్టుబట్టడంతో శాసనసభలో గందరగోళం చెలరేగింది. సభా కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. వాయిదా అనంతరం తెరాస సభ్యులు స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి ఛేంబర్ ముందు ధర్నా చేశారు. సభలోనూ, స్పీకర్ ఛేంబర్ వద్ద తెరాస శాసనసభ్యులు జై తెలంగాణ నినాదాలు చేశారు.
పది మంది, ఇరవై మంది కలిసి సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సహించరానిదని కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. సభా కార్యక్రమాలను సజావుగా నడపడానికి ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. తమ సమస్యలపై అసెంబ్లీ బయట మాట్లాడటం, ఆందోళనలు చేయడం మంచిది గానీ సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్పై తెలంగాణ కాంగ్రెస్ ప్రాంతీయ సమన్వయ కమిటీ (టిఆర్సిసి) సభ్యులు తేల్చుకోవాల్సిన అవసరం వుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని తెరాస సభ్యుడు కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకమో, అనుకూలమో వారు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రోజులుగా సభా కార్యక్రమాలు స్తంభిస్తుంటే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఏమీ మాట్లాడకపోవడం సరి కాదని తెలుగుదేశం సభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు.