రెచ్చగొట్టద్దు: ఆంధ్రా నేతలకు విహెచ్ సూచన
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ విషయంలో తమ పార్టీ ఆంధ్రా నాయకులు సంయమనం పాటిస్తే మంచిదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ఆంధ్రా నాయకులు తమను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎప్పుడూ అనలేదని, తెలంగాణ అభివృద్ధి జరగాలని మాత్రమే అంటూ వస్తున్నానని ఆయన అన్నారు. గతంలో ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమ ధోరణి మార్చుకున్నారని ఆయన చెప్పారు. ఈ స్థితిలో కాంగ్రెస్ ఆంధ్రా నాయకులు తెలంగాణ నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.
రాయలసీమ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, హైదరాబాద్ పరిసరాల్లో రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల భూములను రాయలసీమ వారు కబ్జా చేశారని, పైగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆంధ్రా నాయకులు తమ పద్ధతి మార్చుకోవడం అవసరమని ఆయన అన్నారు. ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో కూడా వి. హనుమంతరావుకు, రాయపాటి సాంబశివరావుకు మధ్య వాగ్వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.