తెలంగాణ సున్నితమైంది, అందుకే ఓపిక: వైయస్
హైదరాబాద్: తెలంగాణ అంశం సున్నితమైందని, అందుకే ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయకపోవడానికి కారణం అదేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెరాస విధ్వంసానికి దిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. తమకు ఇతర కార్యక్రమాలు ఉన్నందున సభా కార్యక్రమాలను మరిన్ని రోజులు పొడిగించలేమని ఆయన చెప్పారు. శాసనసభా సమావేశాలను మరో నాలుగు రోజులు పొడిగించాలని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి కోరుతున్నారు.
సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలతో చర్చిస్తామని ఆయన చెప్పారు. ఎజెండాలో వున్న అంశాలపై చర్చించిన తర్వాత తెలంగాణపై చర్చించడానికి తాము సిద్ధమేనని ఆయన అన్నారు. తెలంగాణపై తక్షణ చర్చకు తెరాస శాసనసభ్యులు సభలో గత మూడు రోజులుగా పట్టుబడుతున్న విషయంపై స్పందిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు.