నా దయతోనే తెరాసకు సీట్లు: కేశవరావు
హైదరాబాద్: కాంగ్రెస్ను ద్రోహి అన్నందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. తన దయ లేకపోతే తెరాసకు శాసనసభ ఎన్నికల్లో ఇన్ని సీట్లు వచ్చి వుండేవా? అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. తెరాస నాయకులు తెలంగాణ నినాదం చేసుకున్నారు కాబట్టి తాను వారి వెంట నడిచేందుకు ప్రయత్నించానని, వారి బలాన్ని చూసి కాదని ఆయన అన్నారు.
తెరాస తమతో పొత్తు పెట్టుకోకపోతే ఇన్ని సీట్లు వచ్చి వుండేవా అని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వారి బలమెంతో తెలిసిపోయిందని ఆయన అన్నారు. "నేను పిగ్మీనా, కోన్కిస్కానా? అసలు మీ బలమెంత? నా యింటికి వస్తారు, మాట్లాడతారు, నన్ను తిడతారా? అని ఆయన అన్నారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలను ఆయన తప్పు పడుతూనే రాయపాటి అలా మాట్లాడడానికి తెరాస నాయకులే కారణమని ఆయన అన్నారు. తమ పార్టీ నేత సోనియా గాంధీ మాటకు కట్టుబడి ఆంధ్రా నాయకులు తమ భావాలను అణచుకున్నారని, ఇప్పుడు తెరాస నాయకులు తమ పార్టీని, పార్టీ నాయకత్వాన్ని తిడుతుంటే రాయపాటి తమ భావాలను అణచుకోలేకపోయారని ఆయన అన్నారు. రాయపాటి భావాలను తాను అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు.