తెలంగాణ ఉద్యమంపై వైయస్ కుట్ర: తెరాస
వరంగల్: తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ విమర్శించారు. ఇంటలిజెన్స్ విభాగం ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ నిజాయితీతో వ్యవహరించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ కన్నా సిపియం నిజాయితీగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
మజ్లీస్ను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. దేశంలో ఏర్పడిన రాష్ట్రాలేవీ ఎస్సార్సీలతో ఏర్పడలేదని ఆయన అన్నారు. డియంకె తెలంగాణకు మద్దతుగా లేఖ ఇవ్వలేదని కాంగ్రెస్ అనడాన్ని ఆయన ప్రస్తావిస్తూ లేఖ ఇవ్వనప్పటికీ డియంకె తెలంగాణకు అనుకూలంగా వుందని, ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు బాలు స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు.