కరవుకు బాబు ప్రభుత్వమే కారణం: వైయస్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరవు పరిస్థితులకు గత తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లనే కృష్ణా, గోదావరి నదీ జలాలు వృధా సముద్రంలో కలిసిపోతున్నాయని, పెద్ద యెత్తన వరదలు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో కరవు నెలకొనడానికి గత ప్రభుత్వం నదీ జలాలను వినియోగించుకోవడానికి ప్రాజెక్టులను నిర్మించకపోవడమే కారణమని ఆయన అన్నారు. కరవు పరిస్థితులపై శాసనసభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సోమవారంనాడు సమాధానమిచ్చారు.
తాము చేపట్టిన ప్రాజెక్టులను, వాటి ద్వారా వివిధ ప్రాంతాల్లో సాగునీరు అందించే వివరాలను ఆయన వివరించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న అనంతపురం జిల్లాలో కానుగ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. కరవు ప్రాంతాల్లోని రైతులకు ఇన్పుట్స్ సబిడ్సీ ఇవ్వాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారు. తాము నీటి పారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ఆ ప్రాజెక్టుల్లో అవినీతికి మాత్రమే వ్యతిరేకమని చంద్రబాబునాయుడు అన్నారు.