తెరాసపై వైయస్ పంతం నెగ్గింది: బిజెపి
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) నుంచి గెంటివేయడంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పంతం నెగ్గించుకున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను, రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీని మేనేజ్ చేయడంలో విజయం సాధించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణపై కాంగ్రెస్, తెరాసలు నాటకం ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అసమర్థులని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అసమర్థత ఎమ్మార్వో కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి పేషీ దాకా కన్పిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం వుందని ఆయన చెప్పారు. తెలంగాణపై వేచి చూసే వైఖరిని అవలంబించనున్నట్లు ఆయన తెలిపారు.