తెలంగాణ ఉనికికి సంబంధించింది: మధుయాష్కీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ అవసరం లేదని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు మధు యాష్కీ గౌడ్ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగానే వుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ సాగదీయడం లేదని, అయితే జాప్యం తప్పడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ అభివృద్ధితో సమసిపోదని, ఇది ఉనికికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు.
తెలంగాణ ఏర్పాటు కోసం తాము ఇది వరకే తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశామని, మళ్లీ కలుస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైదొలిగిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణపై సీరియస్గా ఆలోచిస్తోందని ఆయన చెప్పారు. ఇప్పటికీ తెలంగాణ భావన బలంగా వుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా సిపియం గతంలో స్పందించినంత తీవ్రంగా ఇప్పుడు స్పందించడం లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బిల్లు పెడితే తాము వ్యతిరేకించబోమనే పద్ధతిలో మాట్లాడుతోందని ఆయన అన్నారు. సిపియం తెలంగాణపై వ్యతిరేకతను తగ్గించుకోవడం కాంగ్రెస్ కృషి వల్లనే సాధ్యమైందని ఆయన అన్నారు.