తెలంగాణకు మా మద్దతు ఎందుకు?: సిపియం
వరంగల్: పార్లమెంటు సభ్యుల జీతాలు పెంచడానికి తమ మద్దతు అవసరం లేనప్పుడు తెలంగాణ బిల్లును అమోదింపజేసుకోవడానికి తమ మద్దతు ఎందుకని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు ప్రశ్నించారు. తెలంగాణకు మద్దతు తెలియజేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు మంగళవారం రాఘవులుకు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. ముందు తెలంగాణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన తెరాస కార్యకర్తలకు సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రపంచ బ్యాంక్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రపంచ బ్యాంక్ బాటలో నడిచారని, ఇప్పుడు చంద్రబాబు బాటలో వైయస్ రాజశేఖర రెడ్డి నడుస్తున్నారని, వీరిద్దరికి మధ్య ఏదో రహస్య అవగాహన వుందని ఆయన అన్నారు. నిత్యావసర ధరలు పెంచితే తాము కేంద్రంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని ఆయన హెచ్చరించారు. రేషన్కార్డులు ఇచ్చినవారందరికీ రేషన్ ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి భజనకు కేటాయించినంత సమయాన్ని కూడా ప్రజా సమస్య పరిష్కారానికి కేటాయించడం లేదని ఆయన విమర్శించారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ఆయన అన్నారు. పొన్నాల లక్ష్మయ్య ఇంగితం లేని ప్రకటనలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.