కెకె ఇంటి ముందు ధర్నా చేస్తాం: నరేంద్ర
హైదరాబాద్: తమ పార్టీని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవ రావు ఇంటి ముందు ధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత ఎ. నరేంద్ర హెచ్చరించారు. కేశవరావు అసలు తెలంగాణవాదే కారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేశవరావు సమైక్య విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పని చేశారని ఆయన అన్నారు. కేశవరావు తెలంగాణ ముసుగు కప్పుకున్న సమైక్యవాది అని ఆయన వ్యాఖ్యానించారు. కేశవరావు పూర్వీకులు ఆంధ్రాకు చెందినవారే కాకుండా గతంలో సమైక్యవాదిగా కేశవరావు పని చేశారని ఆయన అన్నారు. ఇలాగే మాట్లాడితే కేశవరావు బండారం బయటపెడతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రాంతీయ సమన్వయ కమిటీ పేరు చెప్పి కేశవరావు ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ తమతో అమీతుమీకి దిగితే తాము సిద్ధంగా వుంటామని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత కేశవరావుకు లేదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు కేశవరావే తమ కోసం పడిగాపులు కాశారని ఆయన అన్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కేశవరావు తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో కేశవరావు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. కేశవరావు తమ సైజు అడగడాన్ని ప్రస్తావిస్తూ దమ్ము, ధైర్యం వుంటే సిద్ధిపేట సభకు రావాలని, అక్కడ తమ బలమేమిటో చూపుతామని ఆయన హెచ్చరించారు. మూడున్నర ఫీట్లు ఉన్న కేశవరావు ఆరు ఫీట్లు ఎక్కాలనుకుంటే పడిపోతారని ఆయన అన్నారు. తెలంగాణ పేరు చెప్పుకుని కేశవరావు పిసిసి అధ్యక్షుడు కావడమే కాకుండా రాజ్యసభ సీటును కూడా పొందారని ఆయన అన్నారు. కేశవరావు ఎంత వున్నారో అంతే వుంటే మంచిదని ఆయన అన్నారు. కేశవరావు ప్రభుత్వ భూములను అక్రమించుకుని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తేల్చుకుందామని కేశవరావు అంటున్నారని, తాము తేల్చుకోవడానికి సిద్ధంగా వున్నామని, దమ్ముంటే రావాలని ఆయన అన్నారు. పుండు ఒక చోట వుంటే మందు ఒక చోట అన్నట్లు ఇప్పుడు రెండో ఎస్సార్సీ అవసరం లేదని ఆయన అన్నారు.