లిడ్క్యాప్ భూముల విక్రయంపై రభస: సభ వాయిదా
హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యుల మధ్య చెలరేగిన వివాదం మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ వాయిదాకు దారి తీసింది. మొదట అరగంట సేపు వాయిదా పడిన శాసనసభ ఆ తర్వాత తిరిగి సమావేశమైన తర్వాత కూడా సద్దుమణగకపోవంతో సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది. లిడ్క్యాప్ వ్యవహారంపై మంత్రి జె. గీతారెడ్డి సమాధానం ఇస్తుండగా జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడిపై తీవ్రమైన వ్యాఖ్య చేశారు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాల్, ప్రతిసవాళ్లు వేసుకుంటున్న సమయంలో సభ్యులు ప్రశ్నలు వేయడానికి, అనుబంధ ప్రశ్నలు వేయడానికి మాత్రమే పరిమితం కావాలని స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి చేసిన సూచనను ఎవరూ పట్టించుకోలేదు.
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబుకు గొప్ప విజన్ వుందని, అయితే వాటిని ఆచరణలో పెట్టడానికి తగిన ప్రణాళికలు లేవని రాజశేఖర రెడ్డి అనడంతో గొడవ ప్రారంభమైంది. లిడ్క్యాప్ భూములను సింగపూర్ కంపెనీకి విక్రయించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుగుదేశం సభ్యుడు సాయన్న మొదట ప్రశ్నోత్తరాల సమయంలో వ్యతిరేకించారు. చర్మకారుల కోసం లెదర్ పార్కులను ఏర్పాటు చేయడానికి వనరులను వాడాలి గానీ సింగపూర్ కంపెనీకి భూములు లిడ్క్యాప్ భూములను ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుందని నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. తాము లెదర్ పార్కుల ఏర్పాటుకు పూనుకున్నామని, వీటి వల్ల 7 లక్షల మంది ఎస్సిలకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. అయితే మంత్రి గీతారెడ్డి చంద్రబాబుపై ఎదురుదాడికి దిగారు. మౌలిక సదుపాయాల సమీకరణకు లిడ్క్యాప్ భూములు విక్రయిస్తున్నామని, వాటిని అమ్మడం తప్పడం లేదని ఆమె అన్నారు. దీనికి చంద్రబాబు ప్రతిస్పందిస్తూ తప్పులను మంత్రి సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వెలుగు ప్రాజెక్టులో 2 వేల కోట్ల రూపాయాలు వున్నాయని, వాటిని పార్కుల ఏర్పాటుకు వాడుకోవచ్చునని ఆయన అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి, చంద్రబాబునాయుడుకు మధ్య సంవాదం చెలరేగింది. ఈ సమయంలో గందరగోళం చెలరేగడంతో సభ వాయిదా పడింది. లిడ్క్యాప్ భూముల విక్రయంపై అప్పటికే సిపియం సభ నుంచి వాకౌట్ చేసింది.