అసెంబ్లీ: రెండో రోజూ తెరాస సభ్యులపై వేటు
హైదరాబాద్: వరుసగా రెండో రోజు మంగళవారం కూడా శాసనసభ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులపై వేటు పడింది. సభా కార్యక్రమాలను స్తంభింపజేయడంతో స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి 15 మంది తెరాస సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్తో బలవంతంగా వెలుపలికి పంపించారు. వివిధ పార్టీలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలసు స్పీకర్ సభ ప్రారంభం కాగానే తిరస్కరించారు. అయితే తెలంగాణపై తీర్మానం చేయాలని పట్టుబడుతూ తెరాస సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ జై తెలంగాణ నినాదాలు చేశారు.
తెలంగాణపై చర్చకు అనుమతించాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస సభ్యులు సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీంతో తెరాస సభ్యుల సస్పెన్షన్కు తీర్మానం ।పతిపాదించాలని స్పీకర్ సురేష్ రెడ్డి శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్యకు సూచించారు. రోశయ్య తీర్మానం ప్రతిపాదించారు. సస్పెన్షన్కు తీర్మానం చేసిన తర్వాత కూడా తెరాస సభ్యులు వెళ్లిపోకపోవడంతో మార్షల్స్తో గెంటివేయించారు. అనంతరం తెరాస సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, ఇది దుర్మార్గమని తెరాస సభ్యుడు నాయని నర్సింహారెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై 16 రోజులు చర్చ జరిగిన సందర్భం వుందని, అటువంటప్పుడు తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించడానికి అనుమతించి చర్చించి ఓటింగ్ పెట్టడానికి ఎందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ పెడితే తెలంగాణ వ్యతిరేకులెవరో, అనుకూలురెవరో ప్రజలకు తెలుస్తుందని, ఈ విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.