హస్తినలో ముఖ్యమంత్రి వైయస్ బిజీ బిజీ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా వున్నారు. ఆయన శుక్రవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారి రాజశేఖర రెడ్డి సోనియాతో సమావేశమయ్యారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి వర్గ విస్తరణ గురించి కూడా రాజశేఖర రెడ్డి సోనియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దసరాకు మంత్రివర్గ విస్తరణ వుంటుందని రాజశేఖర రెడ్డి గురువారం సాయంత్రం హైదరాబాద్లో చెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్తో అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ సమయంలో ఇరువురి మధ్య తెలంగాణ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి భరద్వాజ్ను కూడా ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసమండలి పునరుద్ధరణకు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన భరద్వాజ్ను కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో కూడా రాజశేఖర రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఆయన చిదంబరాన్ని కోరారు. వరద ప్రాంతాల్లో సహాయంపై కూడా ఆయన మాట్లాడినట్లు సమాచారం.