ప్రైవేట్ ఆస్పత్రిపై దాడి: లాఠీచార్జి, 6గురి ఆరెస్టు
నిజామాబాద్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగి చనిపోయాడంటూ రోగి బంధువులు, విద్యార్థులు శుక్రవారంనాడు నిజామాబాద్లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పరిస్థితి ఎంతకీ అదుపు కాకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీను అనే ఎస్ఎస్ఆర్ కాలేజీ విద్యార్థి ప్రగతి నర్సింగ్ హోమ్లో చికిత్స నిమిత్తం చేరాడు. డబ్బుతో వస్తేనే చికిత్స చేస్తామని వైద్యులు చెప్పారని, డబ్బు తెచ్చిన తర్వాత కూడా సరైన చికిత్స అందించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే రోగి మరణించాడని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతికి నిరసనగా తాము శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తుంటే పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని విద్యార్థులంటున్నారు. పోలీసులు ఆస్సత్రి యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని వారంటున్నారు.