జనశక్తి అగ్రనేత రాజన్న అరెస్టు?
హైదరాబాద్: సిపిఐ (యంయల్) జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి రాజన్న అలియాస్ కెఆర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రాజన్న అరెస్టును అధికారికంగా ప్రకటించాలని మావోయిస్టుల చర్చల మాజీ ప్రతినిధులు వరవరరావు, గద్దర్, జనశక్తి చర్చల మాజీ ప్రతినిధి చంద్రన్న హోంమంత్రి కె. జానారెడ్డిని కోరారు. వారు శుక్రవారం ఉదయం జానారెడ్డిని కలిశారు. అయితే రాజన్నను పోలీసులు అరెస్టు చేయలేదని హోం మంత్రి జానారెడ్డి అంటున్నారు. కానీ జానారెడ్డి మాటలతో ప్రజా సంఘాల నాయకులు ఏకీభవించడం లేదు. రాజన్నను ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసినట్లు తమకు కచ్చితమైన సమాచారం ఉందని చంద్రన్న వాదిస్తున్నారు. రాజన్నతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారని ఆయన చెబుతున్నారు. రాజన్నను గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో బరాయిబక్క బస్స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత కె. చంద్రశేఖరరావు చెప్పారు.
జానారెడ్డి ఇంటలిజెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజన్నను కోర్టులో హాజరు పరచాలని చంద్రన్న డిమాండ్ చేశారు. రాజన్నను ఎన్కౌంటర్ చేసే ప్రమాదం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్నపై మూడు లక్షల రూపాయల రివార్డు వుంది. రాజన్న అదుపుతో జనశక్తిలోని బలమైన వర్గం పూర్తిగా బలహీనపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. రాజన్న ప్రాణాలకు హాని తలపెట్టకూడదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత కె. చంద్రశేఖరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజన్నతో పాటు అరెస్టు చేసినవారందరిని కోర్టులో హాజరు పర్చాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూర రాజన్న భార్య రంగవల్లి ఉద్యమంలోనే పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం ఎన్కౌంటర్లో మరణించారు. రాజన్న సోదరుడు అమర్ జనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వున్నారు. ఇటీవల ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో అమర్ పాల్గొన్నారు.