సారయ్య ఇంటి ముందు తెరాస ధర్నా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉద్యమంలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారంనాడు వరంగల్లోని కాంగ్రెస్ శాసనసభ్యుడు బస్వరాజు సారయ్య ఇంటి ముందు ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్ఠానంపై వత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ధర్నాకు ఉపక్రమించారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుల ఇళ్ల ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని వారు చెప్పారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ, తెలంగాణకు అనుకూలంగా పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదిలావుంటే, కరీంనగర్లో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించేలా అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేస్తూ వీరు ఈ రిలే నిరాహార దీక్షలకు దిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు.