ఫిరోజ్ ఆచూకీ: పోలీసులపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్: హైదరాబాద్లోని బేగంపేటలో గల టాస్క్ఫోర్సు కార్యాలయంపై మానవబాంబు దాడి కేసులో సాక్షి ఫిరోజ్ఖాన్ ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టింది. పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఈ విషయంలో విఫలం చెందడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ పోలీసు కమీషనర్ నేతృత్వంలో గానీ, కమీషనర్ ఏర్పాటు చేసే దర్యాప్తు బృందంతో గానీ ఫిరోజ్ఖాన్ ఆచూకీ కనుక్కోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు జస్టిస్ జిల్లాల్ నక్కీ ఆదేశించారు.
ఫిరోజ్ఖాన్ ఆచూకీ కనుక్కోవడానికి ఏర్పాటయ్యే దర్యాప్తు బృందం తన దర్యాప్తు వివరాలను ప్రతి రెండు వారాలకు ఒకసారి తమకు నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. కేసును కేంద్ర దర్యాప్తు బృందానికి (సిబిఐకి) అప్పగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఆచూకీ తెలిసిన వెంటనే ఫిరోజ్ఖాన్ను తమ ఎదుట హాజరు పర్చాలని, సీల్డు కవర్లో దర్యాప్తు నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.