రైతులకు కరెంట్ పెంచకుంటే ఆందోళన: టిడిపి
హైదరాబాద్: వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల పాటు పగటి పూట కరెంట్ సరఫరా చేయాలని తెలుగుదేశం శాసనసభ్యులు సోమవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రికి ఒక వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా పెంచకపోతే తాము ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. రైతులకు 12 గంటలు విద్యుత్ ఇస్తామన్న హామీని వైయస్ అమలు చేయలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
విద్యుత్ సమస్యపై తాము గ్రామ, మండల స్థాయిల్లో ఆందోళనలు చేపడతామని ఆయన చెప్పారు. రాత్రిపూట కరెంట్ ఇవ్వడం వల్ల దాదాపు 250 మంది రైతులు మరణించారని ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయలేసి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన కోరారు. ఆపద్బంధు పథకం కింద వచ్చే నష్టపరిహారం మరణించిన రైతుల కుటుంబాలన్నింటికీ చేరలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు.