మీడియా వద్ద నోరు విప్పని గంగూలీ
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. మొయినుద్దౌలా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఆయన మంగళవారం హైదరాబాద్ వచ్చారు. రేపు (బుధవారం) పశ్చిమ బెంగాల్ జట్టు ముంబాయి జట్టుతో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్ జట్టు తరఫున గంగూలీ మొయినుద్దౌలా కప్ పోటీల్లో ఆడుతున్నాడు. మలేషియా ముక్కోణపు సిరీస్కు, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో గంగూలీకి స్థానం లభించలేదు.
జట్టులో స్థానం లభించకపోవడంపై గంగూలీ సోమవారం కోల్కత్తాలో ఆచితూచి మాట్లాడారు. జట్టుకు తనను ఎంపిక చేయరనే విషయం ఊహించిందేనని ఆయన అన్నారు. శ్రీలంకలో ఒక మ్యాచ్ కూడా జరగలేదని, అందువల్ల శ్రీలంక పర్యటనకు వెళ్లిన జట్టు సభ్యుల్లోంచి తొలగింపులు కష్టమేనని, ఆ జట్టునే తిరిగి ఎంపిక చేయడమనేది సహజమైన చర్య అని ఆయన అన్నారు. ప్రపంచ కప్కు జట్టును ఎంపిక చేయడానికి ఇంకా చాలా సమయం వుందని, ఇప్పటి నుంచి తాను దేశివాళీ క్రికెట్పై దృష్టి సారిస్తానని, దులీప్, రంజీ ట్రోఫీల్లో ఆడుతానని ఆయన చెప్పారు.