4గురు రాజీనామా: సంక్షోభంలో ముండా ప్రభుత్వం
రాంచీ: జార్ఖండ్లోని అర్జున్ ముండా ప్రభుత్వం సంక్షోభంలో పడింది. జార్ఖండ్లోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ)లోని నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి అర్జున్ ముండాకే కాకుండా గవర్నర్కు కూడా సమర్పించారు. వీరిలో ముగ్గురు స్వతంత్రులు కాగా, ఒకరు ఎన్సిపికి చెందినవారు. ఇన్నోస్ ఎక్కా, హరినారాయణ్ రాయ్, మధు కోడా, కమలేష్ సింగ్ తమ రాజీనామాలను గవర్నర్కు సమర్పించారు.
ముఖ్యమంత్రికి తమపై నమ్మకం లేదని రాజీనామా చేసిన మంత్రులు అన్నారు. ఈ రాత్రి వీరు గవర్నర్ను కలిసే అవకాశాలున్నాయి. వీరు యుపిఎలో చేరే అవకాశం వున్నట్లు భావిస్తున్నారు. అయితే తన ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని, శాసనసభలో తాను బలాన్ని నిరూపించుకుంటానని ముఖ్యమంత్రి అర్జున్ ముండా అంటున్నారు. తాను కోల్కత్తాకు వెళ్తుండగా పోలీసులు తనను నిర్బంధించారని కమలేష్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వల్ప మెజారిటీతో అర్జున్ ముండా ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. రాజీనామా చేసి ఢిల్లీలో మకాం వేసిన ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో ముండా ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నాయి. 82 మంది సభ్యులు గల శాసనసభలో యన్డిఎ బలం ఇప్పటి వరకు 42. యన్డిఎ భాగస్వామ్య పక్షాల్లో బిజెపి (30), జెడి - యు (6), స్వతంత్రులు (5), యన్సిపి (1) ఉన్నాయి. ప్రతిపక్షంలో జెయంయం (17), కాంగ్రెస్ (9), ఆర్జెడి (7), సిపిఐ (యంయల్) (1), యుజిడిపి (2), ఫార్వర్డ్ బ్లాక్ (2) ఉన్నాయి. ఒక నామినేటెడ్ సభ్యుడు ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నారు.