నక్సల్స్ కట్టడికి ప్రధాని సూచనలు
న్యూఢిల్లీ: నక్సలైట్ ఉద్యమాన్ని కట్టడి చేయడానికి మంత్రులతో కూడిన సాధికారిక గ్రూపును ఏర్పాటు చేయాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారు. ఈ గ్రూపులో ఎంపిక చేసిన మంత్రులుండాలని, దానికి హోం మంత్రి నేతృత్వం వహిస్తారని, ఈ గ్రూపు నిర్ణీత కాలవ్యవధుల్లో సమావేశమవుతుందని ఆయన వివరించారు. అంతర్గత భద్రతపై ఏర్పాటైన ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన మంగళవారం ప్రారంభోపన్యాసం చేశారు. మంత్రుల గ్రూపు తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై, ఇతర రాష్ట్రాలతో అధికారుల పరస్పర మార్పిడిపై చర్చిస్తుందని ఆయన అన్నారు. నిఘా వ్యవస్థను పటిష్టపరుచుకోవాల్సిన అవసరంపై ఆయన నొక్కి చెప్పారు.
శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్ను మెరుగుపర్చాల్సిన అవసరం వుందని, నిఘాను పెంచడంతో పాటు మొత్తంగానే నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని ఆయన అన్నారు. విశ్లేషనా సామర్థ్యాన్ని పెంచడం అవసరమని ఆయన అన్నారు. వ్యక్తిగత దృష్టి పెట్టకపోతే పరిస్థితులు మెరుగుపడవని ఆయన ముఖ్యమంత్రులతో అన్నారు. అభివృద్ధి చర్యలపై దృష్టి పెడుతూనే నక్సలైట్ హింస పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సలైట్ కార్యకలాపాలు విస్తృతంగా వున్నాయని ఆయన అన్నారు. విదేశీ శక్తుల ప్రోత్సాహంతో, ఆదేశాలతో దేశంలో పెరుగుతున్న టెర్రరిస్టు చర్యల పట్ల కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ప్రజల పాత్ర కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో మైనారిటీలు, ముఖ్యంగా ముస్లిమ్లపై వ్యతిరేక ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు.