వందేమాతరాన్ని బలవంతంగా రుద్దం: మంత్రి
హైదరాబాద్: వందేమాతరం గీతాలాపనను అనవసరంగా వివాదం చేస్తున్నారని రాష్ట్ర ప్రాథమిక విద్యా మంత్రి ఎన్. రాజ్యలక్ష్మి అన్నారు. గురుపూజ దినోత్సవం సందర్భంగా ఆమె మంగళవారంనాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వందేమాతరం గేయాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా పాడాలనే ఆదేశాలకు సంబంధించి ఎటువంటి వివాదమూ లేదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.
వందేమాతరం గేయంలోని రెండు చరణాలను తప్పనిసరిగా పాడాలని తాము పాఠశాలలను ఆదేశించామని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ విషయమై తాము సర్క్యులర్లు జారీ చేశామని ఆమె చెప్పారు. వందేమాతరం గీతాన్ని ఎవరిపై బలవంతంగా రుద్దబోమని ఆమె అన్నారు. ఏ మతంతోనూ సంబంధం లేని రెండు చరణాలను మాత్రమే పాడాలని తాము ఆదేశించామని ఆమె అన్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 11 గంటలకు అన్ని పాఠశాలల్లో వందేమాతరం గేయాన్ని ఆలపించాలని తాము ఆదేశించినట్లు ఆమె తెలిపారు.