తెరాస లాబీయింగ్ అట్టర్ ఫ్లాప్: వెంకయ్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జరిపిన లాబీయింగ్ అట్టర్ ఫ్లాప్ అయిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ తన ద్వంద్వ వైఖరిని విడనాడాలని ఆయన సూచించారు. అంత జరిగిన తర్వాత కూడా తెరాస కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని పట్టుకుని వేళ్లాడడం సరి కాదని ఆయన అన్నారు.
తెలంగాణపై రెండో ఎస్సార్సీని వేయాలనేది కాంగ్రెస్ విధానమైతే ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని ఎందుకు వేశారని ఆయన అడిగారు. ప్రణబ్ కమిటీని వేయడం కాలక్షేపానికా, కాలయాపనకా, ప్రజలను మభ్యపెట్టడానికా అని ఆయన అడిగారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలనేది తమ విధానమని ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదని ఆయన కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అలాగైతే ఎన్నికలయిపోయి ఇంత కాలం గడిచిన తర్వాత కూడా రెండో ఎస్సార్సీని ఎందుకు వేయలేదని ఆయన అడిగారు. ఎన్నికల్లో తెరాసతో పొత్తుకు ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని ఆయన కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.