పోతిరెడ్డిపాడుపై మళ్లీ మర్రి, పిజెఆర్ల అభ్యంతరం
హైదరాబాద్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్కు చెందిన ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు మర్రి శశిధర్ రెడ్డి, పి. జనార్దన్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుకు గురువారంనాడు ఒక లేఖ అందజేశారు. ఒక కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా వారిద్దరు గాంధీభవన్కు వచ్చిన కేశవరావుకు తమ లేఖను అందజేశారు. అయితే అక్కడే వున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని మాత్రం వారు కలుసుకోలేదు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం వల్ల తెలంగాణకు, కోస్తాకు అన్యాయం జరుగుతుందని వారు మీడియా ప్రతినిధులతో అన్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడంపై తాము లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని వారన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్కు శ్రీశైలం నుంచి మిగులు జలాలను మాత్రమే తీసుకుపోతామని అంటున్నారని, అయితే వాటిని ఏ విధంగా తీసుకుపోతారనే విషయాన్ని చెప్పడం లేదని జనార్దన్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు వల్ల హైదరాబాద్ గొంతు ఎండిపోతుందని వారన్నారు. జిల్లా మధ్య వివాదాలు సృష్టించే విధంగా వైయస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని శశిధర్ రెడ్డి విమర్శించారు. తమ శాసనసభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై నిపుణులను సంప్రదిస్తానని పిసిసి అధ్యక్షుడు కేశవరావు చెప్పారు. కర్నూలు జిల్లా నేతలు కూడా పోతిరెడ్డిపాడుపై కొన్ని అంశాలను తన దృష్టికి తెచ్చారని, అన్నింటినీ పరిశీలించి తగిన విధంగా ప్రతిస్పందిస్తామని ఆయన చెప్పారు.