రాక్షస క్రీడ: సీనియర్లకు 21 వరకు రిమాండ్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జియంఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్కు పాల్పడిన ఏడుగురు సీనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వారికి ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిని పోలీసులు పాలకొండ సబ్ జైలుకు తరలించారు. దాసరి విజయభాస్కర్, తిరుపోటి రమేష్, సంతోష్, దాసరి విజయబాబు, ఎర్రయ్యబాబు, బాసూరు కృష్ణచైతన్య అనే సీనియర్ విద్యార్థులు షాడ పంచముఖేష్ అనే జూనియర్ విద్యార్థితో స్వలింగ సంపర్కానికి పాల్పడడమే కాకుండా దీన్ని రికార్డు చేశారు. జూనియర్ విద్యార్థి చేత వంట పని, ఇంటి పని చేయించి వేధించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఈ విషయాన్ని మరో జూనియర్ విద్యార్థి క్రైమ్ స్టాపర్కు తెలియజేశాడు. వెంటనే పోలీసులు స్పందించి సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
జూనియర్ విద్యార్థిని వేధించిన సీనియర్ విద్యార్థులపై పోలీసులు ర్యాగింగ్, ప్రకృతి విరుద్ధమైన కార్యకలాపాల కింద కేసులు నమోదు చేశారు. కాగా, కేసు ఉపసంహరించుకోవాలని సీనియర్ విద్యార్థుల బంధువులు బాధితులను వేడుకుంటున్నట్లు సమాచారం. జూనియర్ విద్యార్థిపై అత్యాచారం, ర్యాగింగ్ సంఘటన కళాశాల వెలుపల జరిగినందున తమకేమీ సంబంధః లేదని కళాశాల యాజమాన్యం అంటున్నది. పైగా ఏడుగురిలో ఇద్దరి పేర్లు హాజరు పట్టీలో లేవని, మరో ఐదుగురిని సస్పెండ్ చేశామని చెబుతోంది. ఈ సంఘటనతో సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.