వందేమాతర గీతాలాపన ప్రతిధ్వనులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారంనాడు వందేమాతర గీతాలాపన ప్రతిధ్వనించింది. వందేమాతర గీతానికి వందేళ్లు నిండిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 11 గంటలకు వందేమాతర గీతాన్ని ఆలపించారు. హైదరాబాద్లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) కార్యాలయం గాంధీభవన్లో జరిగిన వందేమాతర గీతాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. మన మాతృభూమిని, మన దేశాన్ని గౌరవించడం మనల్ని మనం గౌరవించుకోవడమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు కూడా పాల్గొన్నారు.
విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వందేమాతర గీతాన్ని ఆలపించారు. వీరు వందేమాతర గీతం పూర్తి పాఠాన్ని పాడారు. వరంగల్లోని మాజీ ప్రధాని దివంగత పి.వి. నరసింహారావు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వందేమాతర గీతాన్ని ఆలపించారు. తిరుపతిలో స్వదేశీ జాగరణ మంచ్ కార్యకర్తలు వందేమాతరం గీతాన్ని పాడారు. మొదట వారు విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. వందేమాతరం గీతానికి జాతీయ గీతం హోదా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ పాఠశాలల్లో విద్యార్థులు వందేమాతర గీతాన్ని ఆలపించారు.