మాలెగావ్లో పేలుళ్లు: 25 మంది బలి
ముంబాయి: ముంబాయికి 180 కిలోమీటర్ల దూరంలో గల నాసిక్ జిల్లాలోని మాలెగావ్ పట్టణంలో మూడు చోట్ల వరుసగా పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో కనీసం 25 మంది మృతి చెందినట్లు, మరో 100 మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. మాలెగావ్ పట్టణంలోని మసీదు వెలుపల జరిగిన పేలుడులో కనీసం ఏడుగురు మరణించినట్లు, మరో 25 మంది గాయపడినట్లు సమాచారం. పట్టణం గుండెకాయ వంటి ప్రదేశంలో గల నురాని మజీదులో ముస్లిమ్లు ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది.
మరో పేలుడు పశు వధశాల వద్ద జరిగింది. మూడు బాంబు పేలుళ్లు కూడా రెండు నిమిషాల వ్యవధిలో జరిగాయి. నాసిక్కు 110 కిలోమీటర్ల దూరంలో గల మాలెగావ్ మతపరంగా సున్నితమైన పట్టణం. దీంతో పట్టణంలో జనజీవన వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీనికి బాధ్యులెవరనేది ఇంకా తెలియలేదు. మాలేగావ్లో సెల్ఫోన్ సేవలు నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. మరణాల సంఖ్య మరింత పెరగవచ్చునని భావిస్తున్నారు.