పోతిరెడ్డిపాడుపై అనవసర రాద్ధాంతం: పొన్నాల
హైదరాబాద్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ ప్రాజెక్టుపై అనుమానాలు అవసరం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పరిమితికి మించి పోతిరెడ్డిపాడుకు కృష్ణా జలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించబోమని ఆయన స్పష్టం చేశారు.
త్వరలోనే కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ఆయన చెప్పారు. 8.5 లక్షల ఎకరాలకు సాగు నీరందించే పెద్దగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుడుతారని ఆయన చెప్పారు. పెద్దగడ్డ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని నిపుణుల నివేదికలు తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు.