కిడ్నాప్ చేసిన 6గురు ముఠా సభ్యుల అరెస్టు
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఆరుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఈ ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి రెండు బొమ్మ తుపాకులు, 14 లక్షల రూపాయల నగదు, ఒక మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు నేతృత్వంలోని ఈ ముఠా సభ్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని చెప్పి ఒక ప్లాట్ అమ్మకానికి చూపి రమేష్, శ్రీనివాస్ అనే ఇద్దరిని కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ చేసిన ఇద్దరిని ఆ ముఠా సింగరేణి కాలరీస్కు తీసికెళ్లి కోటి రూపాయలు డిమాండ్ చేసింది. ఈ నెల ఐదవ తేదీన ఈ కిడ్నాప్ జరిగింది. దీంతో తమ వద్ద ఉన్న పది లక్షల రూపాయలను రమేష్ ముఠా సభ్యులకు ఇచ్చేశాడు. దీంతో సంతృప్తి చెందని ముఠా సభ్యులు రమేష్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. రమేష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. నాగరాజు నాయకత్వంలో రాజు, కృష్ణ, రామకృష్ణ, రామాచారి, మరో వ్యక్తి ముఠా సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.