పవార్ను నేను కలుసుకోలేదు: తెల్గీ
ముంబాయి: తనకు జరిగిన నార్కో ఎనాలిసిస్ టెస్టులకు సంబంధించి టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను స్టాంపుల కుంభకోణం ప్రధాన సూత్రదారి అబ్దుల్ కరీం తెల్గీ ఖండించాడు. ఆ వార్తలు అబద్ధాలు, నిరాధారాలని ఆయన అన్నాడు. తాను కేంద్ర మంత్రి శరద్పవార్ను కలుసుకున్నట్లు లేదా మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజబల్కు డబ్బులు ఇచ్చినట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశాడు.
తనకు బెంగుళూర్లో జరిగిన నార్కో ఎనాలిసిస్ టెస్టులకు సంబంధించి వచ్చిన వార్తలను చదివి తాను దిగ్భ్రాంతికి, మానసిక వేదనకు గురయ్యాయని ఆయన అన్నాడు. తనను నుంచి శరద్ పవార్, ఛగన్ భుజబల్ డబ్బులు తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నాడు. తన న్యాయవాదులు హర్షద్ నింబాల్కర్, మిలింద్ పవార్లకు రాసిన లేఖల్లో ఆయన ఈ విషయాలు వివరించాడు. తమపై టెలివిజన్ ఛానెళ్లలో వచ్చిన వార్తలను శరద్పవార్, ఛగన్ భుజబల్ ఖండించారు. శరద్ పవార్ను, భుజబల్ను బూటకపు స్టాంపుల కుంభకోణంలో ఇరికించడానికి కొందరు ఆడిన నాటకం అది అని ఆయన అన్నాడు. ఈ విషయంపై స్పష్టం చేయడానికి తెల్గీ మరిన్ని శాస్త్రీయ పరీక్షలకు, ఏ ఏజెన్సీతోనైనా విచారణకు సిద్ధంగా వున్నాడని ఆయన తరఫు న్యాయవాదులు మిలింద్ పవార్, నింబాల్కర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.