విద్యుత్ ఆఫీసుల ముట్టడి, సిబ్బంది నిర్బంధం
హైదరాబాద్: విద్యుత్ కోతకు నిరసనగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు సోమవారంనాడు ఆందోళనకు దిగారు. విద్యుత్ కార్యాలయాలను, సబ్ స్టేషన్లను ముట్టడించారు. కొన్ని చోట్ల విద్యుత్ అధికారులను, ఉద్యోగులను నిర్బంధించారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో రైతులు ట్రాన్స్కో ఇడిఇ కార్యాలయాన్ని ముట్టడించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రైతులు సబ్ స్టేషన్ను ముట్టడించి, ఎస్ఇని నిర్బంధించారు.
ఖమ్మం జిల్లా మంచుకొండలో రైతులు విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. కార్యాలయానికి తాళాలు వేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. కర్నూలు ట్రాన్స్కో కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. కార్యాలయంలోనికి ప్రవేశించడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగుడా మండలం రాఘవపురం తండాలో పొలం ఎండిపోయి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఎన్కె పల్లిలో రాత్రిపూట మోటార్ పెట్టబోయి కాలిజారి పడిపోయి రైతు మరణించాడు.