కెసిఆర్ ఇంటికి యమ్మార్పియస్ ర్యాలీ
హైదరాబాద్: బలహీనవర్గాలకు చెందిన నాయకులు కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్యలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పియస్) కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు ఇంటికి ర్యాలీ తీశారు. దళితులకు క్షమాపణ చెప్పాలని వారు కెసిఆర్ను డిమాండ్ చేశారు.
యమ్మార్పియస్ కార్యకర్తలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో వారు పోలీసులతో వాగ్వివాదానికి దిగి అక్కడే బైఠాయించారు. కెసిఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 200 నుంచి 300 మంది యమ్మార్పియస్ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు దొరల పెత్తనానికి నిదర్శనమని వక్తలు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందే దొరలు తమ అహంకారం చూపిస్తున్నారని, వచ్చిన తర్వాత ఇంకెంత పెత్తనం చేస్తారో ఊహించుకోవచ్చునని వారన్నారు. కెసిఆర్ ఇంటి ముందు ఎమ్మార్పియస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. కెసిఆర్ క్షమాపణ చెప్పే వరకు శాంతించేది లేదని ఎమ్మార్పీయస్ నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.