బాబు భద్రతకేమీ ముప్పు లేదు: డిజిపి
హైదరాబాద్: భద్రతా సిబ్బందిని తగ్గించినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి వచ్చిన ముప్పేమీ లేదని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ అన్నారు. భద్రత తగ్గింపును రాజకీయం చేయడం మంచిది కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సెక్యురిటీ కమిటీ నివేదిక మేరకే చంద్రబాబుకు భద్రత తగ్గించామని ఆయన చెప్పారు.
చంద్రబాబు ఎప్పుడూ విఐపినే అని, ఇందులో అనుమానం లేదని, చంద్రబాబుకు తాము భద్రత కల్పిస్తూనే వున్నామని ఆయన చెప్పారు. ప్రముఖులకు కల్పించే భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించి మార్పులు చేయడం పరిపాటి అని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఎప్పుడూ కనీస భద్రత వుంటుందని ఆయన చెప్పారు. భద్రతా సిబ్బంది సంఖ్య తగ్గినా చంద్రబాబు చుట్టూ సుశిక్షితులైన భద్రతా సిబ్బంది వుంటుందని ఆయన చెప్పారు. మావోయిస్టుల లాకెట్ లాంచర్ల కేసులో సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.