ర్యాంకింగ్: మరింత దిగజారిన సానియా
న్యూఢిల్లీ: హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ర్యాంక్ మరింత దిగజారింది. తాజా డబ్ల్యుటిఎ ర్యాంకింగ్లో సానియా 70వ స్థానానికి దిగజారింది. 54వ ర్యాంక్తో యుయస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో కాలు మోపిన ఆమె ఆ టోర్నమెంట్లో రెండో రౌండ్లోనే ఓడిపోయింది. దీంతో ఆమె 16 ర్యాంక్లు కోల్పోయింది. యుయస్ ఓపెన్ రెండో రౌండ్లో ఇటలీకి చెందిన ఫ్రాన్సిస్కా స్కివోనియా చేతిలో 5-7, 6-1, 6-2 స్కోర్తో ఓడిపోయింది.
యుయస్ ఓపెన్లో మార్టిన్ డామ్తో కలిసి విజయకేతనం ఎగురవేసిన లియాండర్ పేస్ డబుల్స్ ర్యాంకింగ్లో టాప్ 10లో అడుగు పెట్టాడు. డబుల్స్ ర్యాంకింగ్లో పేస్కు 9వ ర్యాంక్ దక్కింది. మార్టిన్ డామ్కు పదవ ర్యాంక్ సొంతమైంది. పురుషుల, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఓపెనింగ్ రౌండ్లోనే ఓటమి చవి చూసిన మహేష్ భూపతి రెండు ర్యాంక్లు కోల్పోయాడు. ఆయనకు 29వ ర్యాంక్ దక్కింది. సానియా తన ఆటతీరులో కొంత మెరుగ్గా కనిపించినప్పటికీ ఆమె ప్రత్యర్థి తన విజయానికి బాటలు వేసుకుంది. అమెరికాకు చెందిన భారత క్రీడాకారిణి శిఖా ఒబెరాయ్ మూడు స్థానాలు కోల్పోయింది. ఆమె 194వ ర్యాంక్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.