యురేనియం ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం: వైయస్
విశాఖపట్నం: తన నియోజకవర్గానికి నష్టం జరుగుతుంటే తాను చూస్తూ ఊరుకుంటానా? అని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లిలో యురేనియం ప్లాంట్ను ప్రజా సంఘాలు నిరసించడంపై ఆయన సోమవారం ఆ విధంగా ప్రశ్నించారు. యురేనియం ప్లాంట్పై ప్రజా సంఘాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. విశాఖపట్నం జిల్లాలో బాక్సైట్ తవ్వకాల వల్ల 600 మంది మాత్రమే నిర్వాసితులయ్యారని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల నిర్వాసితుల విషయంలో కూడా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తామని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల ఆకాశంలో కట్టలేమని, భూమి మీదనే కట్టాలని, దాని వల్ల కొంత మంది నిర్వాసితులు కావడం తప్పదని, అయితే నిర్వాసితులను తాము అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు.
విజయనగరం జిల్లాలోని పెద్దగెడ్డ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలు ఐదు మాత్రమేనని, పలువురి విజ్ఞప్తి మేరకు మరో ఐదు గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించామని ఆయన చెప్పారు. అపారెల్ కంపెనీ బ్రాండిక్స్ పనితీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వేయి ఎకరాల భూమి కేటాయించినా ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని ఆయన అన్నారు. నిర్వాసితుల ఆందోళనల మధ్య తూర్పు గోదావరి జిల్లాలోని సూరంపాలెం ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. రాజాం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన రాద్ధాంతంపై ఆయన జిల్లా కలెక్టర్ను నివేదిక కోరారు.