కరీంనగర్కు ఉప ఎన్నిక జరగకపోవచ్చు: కాకా
హైదరాబాద్: కరీంనగర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగకపోవచ్చునని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పెద్దపల్లి లోక్సభ సభ్యుడు జి. వెంకటస్వామి (కాకా) అభిప్రాయపడ్డారు. మంత్రి ఎం. సత్యనారాయణరావు సవాల్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావు వ్యాఖ్యల నేపథ్యంలో కరీంనగర్ లోక్సభ సభ్యత్వానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నచ్చజెప్పినప్పటికీ తన రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తున్నారు. ఈ స్థితిలో కాకా గురువారం మీడియా ప్రతినిధుల వద్ద ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చంద్రశేఖరరావు, కె. కేశవరావు, ఎం. సత్యనారాయణ రావుల వివాదం పిల్ల చేష్టలని ఆయన అన్నారు. ఈ వయస్సులో తాను ఆ పిల్లచేష్టల వివాదంలో జోక్యం చేసుకోదలుచుకోలేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధిష్ఠానవర్గం తెరాసతో సత్సంబంధాలనే కోరుకుంటోందని, చంద్రశేఖరరావుకు కేశవరావు క్షమాపణ చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు.