రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కథ సుఖాంతం
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి కె. కృష్ణంరాజు కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు మరో రెండు కిడ్నాప్ కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన విషయం బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి జికె రాజును గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి, ఆయన కుటుంబసభ్యులను కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రత్యర్థులే ఈ కిడ్నాప్నకు దిగి వుంటారని అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసి విజయం సాధించారు.
బుధవారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్ళిన రాజును మారుతీ వ్యాన్లో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. రాజు ఇంటికి ఫోన్ చేసి ఆయన భార్యతో మాట్లాడిన దుండగులు కోటి రూపొయలు ఇస్తే నీ భర్తను విడుదల చేస్తామని చెప్పారు. రాజుతో కూడా దుండగులు ఆయన భార్యతో మాట్లాడించారు. దుండగులు చెప్పినట్టు డబ్బులు ఇచ్చేయమని రాజు తన భార్యకు చెప్పారు. ఈ విషయం పోలీసులకు చె బితే నీ భర్తను చంపేస్తామని చెప్పడంతో ఆమె భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అమెరికాలో ఉన్న కొడుకులతో ఆమె సంప్రదించడంతో బంధువులు రంగప్రవేశం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.