రాకెట్ లాంచర్ల కేసు: రఘు సహా 14 మంది అరెస్టు
చెన్నై: రాకెట్ లాంచర్ల కేసులో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి అలియాస్ రఘుతో పాటు ఈ 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురవారరం రాత్రి దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేశారు. మావోయిస్టుల కోసం కడపలో బుక్ చేసిన రాకెట్ లాంచర్ల బ్యాగులను పోలీసులు ఇటీవల ప్రకాశం జిల్లా గిద్దలూరులో పట్టుకున్న విషయం తెలిసిందే. వీటిని శ్రీనివాస్ రెడ్డి బుక్ చేసినట్లు నిర్ధారణ అయింది. శ్రీనివాస్ రెడ్డి మావోయిస్టుల ఉద్యమంలో చురకుగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
చెన్నై శివారులోని కొరత్తూరు, పాడి, మన్నూరుపేట్ పారిశ్రామికవాడల్లో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ రాకెట్ లాంచర్లను ఈ మూడు యూనిట్లు తయారుచేసినట్లు, మూడు కన్సైన్మెంట్లు క్రాంతి ట్రాన్స్పోర్టులో బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శ్రీనివాస రెడ్డికి సంబంధించిందిగా భావిస్తున్న భారతి పైపుల ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. పలు డాక్యుమెంట్లను,న ఇన్వాయిసెస్ను కూడా పోలీసులు ఈ దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు.