వరంగల్ జిల్లాలో 4గురు మావోయిస్టుల హతం
వరంగల్: వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉన్నట్లు అనుమానిస్తూ తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయం నిర్ధారణ కాలేదు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం అటవీ ప్రాంతంలోని ఊరగుట్టపై ఈ ఎన్కౌంటర్ జరిగింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ఎనిమిది నక్సలైట్లు తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ ఎన్కౌంటర్ తర్వాత ఇదే ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్. మృతుల్లో కరీంనగర్ తూర్పు డివిజన్ కార్యదర్శి అల్వాల్ స్వామి అలియాస్ మధు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
సంఘటనా స్థలం నుంచి పోలీసులు మూడు 303 రైఫిళ్లు, ఒక ఎకె 47, ఏడు కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు మావోయిస్టులపై దాడి చేసినట్లు భావిస్తున్నారు. గత మూడు రోజులుగా మావోయిస్టులు ఊరగుట్టపై సమావేశం అయినట్లు సమాచారం. సమావేశం ముగించుకుని మావోయిస్టులు వెళ్లిపోతుండగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. తాడ్వాయి అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.