రాజీనామాపై కెసిఆర్ వెనక్కి తగ్గరు: తెరాస
హైదరాబాద్: కరీంనగర్ లోక్సభ స్థానానికి తమ నేత కె. చంద్రశేఖరరావు చేసిన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు మెదక్లో స్పష్టం చేశారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి జరిగే ఉప ఎన్నిక తెలంగాణపై రెఫరెండమేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ రాజీనామా విషయంలో ఏ విధమైన అయోమయం లేదని, తాము సంప్రదాయాన్ని అనుసరించామని ఆయన చెప్పారు. నిరాహార దీక్ష చేసినంత మాత్రాన తెలంగాణ రాదని, అందరి దృష్టిని ఆకర్షించడానికే కెసిఆర్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ మోసాన్ని అందరికీ తెలియజేయడమే దీక్ష ఉద్దేశమని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, కరెంట్ కోతకు నిరసనగా తెరాస కార్యకర్తలు శుక్రవారంనాడు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలు చేశారు. రైతులకు నిరంతరాయంగా 12 గంటలు విద్యుత్ అందించాలని తెరాస నాయకులు డిమాండ్ చేశారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు నీరందించడానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ల వద్ద విద్యుదుత్పత్తిని చేపట్టడం లేదని వారు విమర్శించారు. ప్రభుత్వం వ్యవసాయానికి కరెంట్ సరఫరాను పునరుద్ధరించే వరకు ఆందోళన సాగిస్తామని వారు చెప్పారు. నిజామాబాద్ కలెక్టంరేట్ వద్ద జరిగిన ధర్నాకు నరేంద్ర నేతృత్వం వహించారు.