దిగ్విజయ్ నన్నేం అనలేదు: మధుయాష్కీ గౌడ్
న్యూఢిల్లీ: తెలంగాణపై తాను చేసిన వ్యాఖ్యను తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆక్షేపించలేదని కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ సభ్యుడు మధుయాష్కీ గౌడ్ చెప్పారు. తెలంగాణపై వివాదాస్పద ప్రకటన చేసిన ఆయన శుక్రవారంనాడు దిగ్విజయ్ సింగ్ను కలుసుకున్నారు. తాను తెలంగాణ ప్రజల మనోభావాలను దిగ్విజయ్ సింగ్కు వివరించినట్లు ఆయన తెలిపారు. తన ప్రకటన గురించి కూడా దిగ్విజయ్ సింగ్ అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తొందరపడ్డారని దిగ్విజయ్ తనతో అన్నట్లు ఆయన తెలిపారు. తెరాస నాయకులు కాస్తా ఓపిక పట్టాల్సి వుండిందని ఆయన అన్నారు. ఏకాభిప్రాయ సాధనకు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తెరాస నేతలు రాజీనామాలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్కు అనుగుణంగా వ్యవహరించాలని దిగ్విజయ్ చెప్పినట్లు ఆయన తెలిపారు. పార్టీ వైఖరి చెప్పడం మంచిదని, వ్యక్తిగత వ్యాఖ్యలకు, వివాదాస్ప ప్రకటనలకు వెళ్లకూడదని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు ఆయన తెలిపారు.