లగడపాటి అంశంపై అధిష్ఠానిదే నిర్ణయం: సర్వే
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విషయంలో అధిష్ఠానవర్గం చెప్పినట్లు నడుచుకుంటానని సిద్ధిపేట కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ చెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను కలిసిన అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజగోపాల్ ప్రవర్తనలో మార్పు రాలేదని, అలా మార్పు రానంత వరకు తాను వెనక్కి తగ్గబోనని ఆయన చెప్పారు. రాజగోపాల్ను పార్టీ నుంచి బహిష్కరించాలని తాను దిగ్విజయ్సింగ్ను కోరినట్లు ఆయన తెలిపారు.
కలెక్టర్ను సిగ్గు సిగ్గు అన్నందుకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కరణం బలరాంపై కేసు పెట్టి అరెస్టు చేశారని, దళితుడినీ అందునా మాదిగ కులానికి చెందిన తనను సిగ్గు సిగ్గు అనిపించిన రాజగోపాల్పై చర్య ఎందుకు తీసుకోరని ఆయన అన్నారు. రాజగోపాల్ ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తనను పశువు అనే విధంగా రాజగోపాల్ మాట్లాడారని ఆయన అన్నారు. సర్వే సత్యనారాయణ ఎట్టకేలకు దిగివచ్చారు. దిగ్విజయ్ సింగ్ను రెండోసారి కలిసిన అనంతరం లగడపాటితో సమస్య సమసిపోయినట్లేనని మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయంపై తాను ఇక ఏమీ మాట్లాడబోనని చెప్పారు.