సోనియాను కలవబోము: నరేంద్ర
నిజామాబాద్: ఈ నెల 22వ తేదీన తాము కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీని కలవబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత ఎ. నరేంద్ర చెప్పారు. ఈ నెల 23వ తేదీన తాము రాజీనామాలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ అంగీకరిస్తే తాము తిరిగి మంత్రివర్గంలో చేరుతామని ఆయన చెప్పారు.
తాము సోనియా గాంధీనే వదిలేశామని, ఇక పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావుతో ఎలా చర్చలు జరుపుతామని ఆయన ప్రశ్నించారు. తాము ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యమం ఉధృతమైన తర్వాత అన్ని శక్తులూ తమతో కలిసి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కోస్తాలో కొబ్బరి చెట్టుకు ఐదు వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణలో పంటలన్నీ మునిగిపోయినా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తమ ఉద్యమాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవని తెరాస అగ్రనేత కె. చంద్రశేఖరరావు హైదరాబాద్లో అన్నారు.