వరదలతో ఇంకా బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
హైదరాబాద్: ఉభయ గోదావరి జిల్లాల్లో, విజయవాడలో ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఇంకా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. ఆ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఏలేరు రిజర్వాయర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. లంకవాసులు తమ ఇళ్లు ఖాళీ చేసి బిక్కుబిక్కుమంటూ యేటి గట్లపైనే కాలం వెల్లబుచ్చుతూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి ఉధృతి తగ్గలేదు. రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విజయవాడలోని పలు ప్రాంతాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. బుడమేరు ఉప్పొంగుతోంది.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిలకడగా ఉంది. దీని ప్రభావంతో కోస్తా తీరంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. పశ్చిమ తీర ప్రాంతంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం వుంది. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.