కాంగ్రెస్కు పుట్టగతులుండవు: నరేంద్ర
సంగారెడ్డి: కరీంనగర్ ఉప ఎన్నికలో ఓడిపోయిన తర్వాతనైనా తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్కు పుట్టగతులుండవని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత ఎ. నరేంద్ర అన్నారు. కరీంనగర్ ఉప ఎన్నిక కచ్చితంగా తెలంగాణపై రెఫరెండమని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో తీర్మానం చేస్తేనే కరీంనగర్ లోక్సభ స్థానానికి చేసిన రాజీనామాను తమ నేత కె. చంద్రశేఖర రావు ఉపసంహరించుకుంటారని ఆయన చెప్పారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని చాలా మంది అడుగుతున్నారని, అయితే తెలంగాణపై హామీ ఇవ్వకుండా ఉపసహరించుకునే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల గొంతు నొక్కేశారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పదవులు వదిలి తెలంగాణ తల్లి సంకెళ్లను తెంచడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పదవులు ఎర వేస్తారని, పదవులు తీసుకుంటే తెలంగాణ ద్రోహులవుతారని ఆయన అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ అడ్డంకులు కల్పిస్తోందని, తెలంగాణను కాంగ్రెస్ 1952లో, 1969లో, 1972లో మోసం చేసిందని, మరోసారి మోసం చేయడానికి పూనుకుంటోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు తాము అడ్డు రామని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఏకాభిప్రాయం అంటే వంద శాతం మద్దతు ఎప్పుడూ లభించదని ఆయన అన్నారు. కరీంనగర్ ఎన్నికల్లో బిజెపి తమకు మద్దతు ఇవ్వవచ్చునని ఆయన అన్నారు. కరీంనగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని ఆయన అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే తెలంగాణ ఇస్తారా అని ఆయన అడిగారు. ఎవరెన్ని డబ్బులు పెట్టినా కరీంనగర్ ఉప ఎన్నికల్లో కెసిఆర్ గెలిచి తీరుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.