రింగ్ రోడ్డు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపునకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాధితులకు జరుగుతున్న నష్టంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడానికి ఈ ప్రత్యేక ప్యాకేజీ అవసరమని భావిస్తోందని అవుటర్ రింగ్ రోడ్డుపై ఏర్పాటయిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కె. రోశయ్య, సబితా ఇంద్రారెడ్డి తదితరులు గురువారంనాడు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు.
దేశంలోనే మనం చేపట్టిన అవుటర్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టు లేదని, ఇటువంటి ప్రాజెక్టు మన రాష్ట్రంలో మరొకటి చేపట్టే అవకాశం కూడా లేదని, అందువల్ల నిర్వాసితులకు ఉదారంగా నష్టపరిహారం చెల్లించే ఆలోచన చేస్తున్నామని, ఈ విషయమై పరిశీలన జరుపుతున్నామని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం లాగా కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిర్వాసితులకు ఉదారంగా నష్టపరిహారం చెల్లించడం అవసరమని ఆయన అన్నారు.