కెసిఆర్ రాజీనామాను ఆమోదించిన లోక్సభ స్పీకర్
న్యూఢిల్లీ: కరీంనగర్ లోక్సభ సభ్యుడు కె చంద్రశేఖరరావు రాజీనమాను లోక్సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ శనివారం ఆమోదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సిద్ధమనేనని కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేస్తే లోక్సభ సభ్యత్వానికి చేసిన రాజీనమాను ఉపసంహరించుకోడానికి తాను సిద్ధమేనని చంద్రశేఖరరావు ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ కాంగ్రెస్ అలాంటి ప్రకటన చేయడానికి సిద్ధంగా లేదని, రెండో ఎస్సార్సీకే తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేయడంతో కెసిఆర్ లోక్సభ నుంచి వైదొలగక తప్పలేదు. దీనితో కరీంనగర్ లోక్సభ స్ధానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కరీంనగర్ ఉప ఎన్నికలో పోటీచేయడానికి కెసిఆర్ సుముఖంగా లేకపోతే టిఆర్ఎస్ మేధావి, వ్యూహకర్త ప్రొఫెసర్ జయశంకర్ బరిలోకి దిగే అవకాశముంది. తెలుగుదేశం తరఫున మారుతి, కాంగ్రెస్ తరఫున జీవన్రెడ్డి పోటీచేయవచ్చు. కరీంనగర్ లోక్సభ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను, తెలంగాణ అంశాన్ని మలుపు తిప్పనుంది.