పత్రికా స్వేచ్ఛకు భంగం: రాఘవులు
హైదరాబాద్: రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతోందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రజాశక్తి పత్రిక రజోత్సవం ముగింపు సభలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. ఇటీవల ఐజి మీనా ఒక దినపత్రిక ఫొటోగ్రాఫర్పై చేయి చేసుకుని కెమెరాను ధ్వంసం చేసిన సంఘటననను ఆయన ప్రస్తావించారు. వ్యక్తులే కాకుండా అధికారులు కూడా మీడియా ప్రతినిధులపై దాడికి దిగుతున్నారని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు.
మీడియా వార్తలను, వార్తాకథనాలను విమర్శించవచ్చునని, అయితే భౌతిక దాడులకు దిగే దాకా పరిస్థితులు వెళ్తున్నాయని ఆయన అన్నారు. విమర్శ చేయవచ్చు గానీ ఆజమాయిషీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి మీడియా అభిప్రాయాలు, సలహాలు అవసరమని, మీడియా స్వేచ్ఛకు తాము పూర్తిగా సహకరిస్తామని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.