59వ ర్యాంక్కు ఎగబాకిన సానియా
న్యూఢిల్లీ: హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా తన ర్యాంక్ను మెరుగుపరుచుకుంది. కోల్కత్తాలో జరిగిన సన్ఫీస్ట్ ఓపెన్ టోర్నమెంట్లో మెరుగైన ఆటను ప్రదర్శించిన సానియా 70 స్థానం నుంచి 59వ ర్యాంక్కు ఎగబాకింది. సన్ఫీస్ట్లో ఆమె సెమీ ఫైనల్కు చేరుకోవడంతో సోమవారం విడుదల చేసిన డబ్ల్యుటిఎ ర్యాంకింగ్లో ఆమె ర్యాంక్ మెరుగుపడింది.
సన్ఫీస్ట్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్కు చేరుకోవడం ద్వారా సానియా 405 పాయింట్లు సాధించింది. సన్ఫీస్ట్ ఓపెన్ రన్నరప్ అయిన రష్యాకు చెందిన ఓల్గా పుచ్కోవా కన్నా ఆరు స్థానాలపైన ఉంది. సన్ఫీస్ట్ ఓపెన్ విజేత మార్టినా హింగిస్ ఒక స్థానం ఎగబాకింది. తద్వారా ఎనిమిదవ ర్యాంక్ను సొంతం చేసుకుంది. ఆసియా మహిళా క్రీడాకారుల్లో 20వ ర్యాంక్తో చైనాకు చెందిన లీనా అగ్రస్థానంలో వుంది. ఇతర భారతీయ మహిళా క్రీడాకారుల్లో శిఖా ఒబెరాయ్ 232వ స్థానంలో, అంకితా భాంబ్రీ 369వ స్థానంలో, రుష్మీ చక్రవర్తి 454వ స్థానంలో ఉన్నారు. లియాండర్ పేస్, మహేష్ భూపతిల స్థానాల్లో మార్పు లేదు.